కలం, వెబ్ డెస్క్: ముంబై (Mumbai) వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ (Punjab) అద్భుత విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ను హోంగ్రౌండ్లోనే ఉతికారేశారు పంజాబ్ బ్యాటర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యారు. ఈ మ్యాచ్లో శ్రేయాస్ మరోసారి తన కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. వరుస వికెట్లు పడుతున్న సమయంలో ప్రభ్సిమ్రన్తో కలిసి శ్రేయాస్ మ్యాచ్ను మలుపు తిప్పాడు. ముంబై ఇండియన్స్ విసిరిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం 16.3 ఓవర్లలోనే ఊదేశింది. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (80 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్కు, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (66) క్లాస్ టచ్ తోడవడంతో పంజాబ్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై, క్వింటన్ డికాక్ (112 నాటౌట్) మెరుపు సెంచరీతో 195 పరుగులు చేసినప్పటికీ, పంజాబ్ బ్యాటర్ల ధాటికి ఆ స్కోరు ఏమాత్రం సరిపోలేదు. ముఖ్యంగా ప్రభ్సిమ్రన్ కేవలం 39 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్సర్లతో ముంబై బౌలింగ్ యూనిట్ను చిన్నాభిన్నం చేశాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగడంతో పంజాబ్ మరో 21 బంతులు మిగిలి ఉండగానే విజేతగా నిలిచింది. ముంబై బౌలర్లలో గజన్ ఫర్ మినహా మిగిలిన వారందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
ముంబై బ్యాటింగ్లో క్వింటన్ డికాక్ ఒక్కడే సింహంలా పోరాడాడు. 60 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అతనికి తోడుగా నమన్ ధీర్ (50) అర్ధసెంచరీతో రాణించాడు. హార్దిక్ పాండ్యా (14), తిలక్ వర్మ (8) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అవ్వడం ముంబైని దెబ్బతీసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 22 పరుగులకే 3 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. మార్కో జాన్సెన్, శశాంక్ సింగ్ చెరో వికెట్ సాధించారు. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
196 పరుగుల ఛేదనలో పంజాబ్కు ఓపెనర్ల నుంచి ఆశించిన ఆరంభం లభించలేదు. ప్రియాంశ్ ఆర్య (15), కూపర్ కానోలీ (17) త్వరగానే అవుట్ అయినప్పటికీ, ప్రభ్సిమ్రన్ సింగ్ మాత్రం తగ్గలేదు. 205.12 స్ట్రైక్ రేట్తో 80 పరుగులు చేసి ముంబై ఆశలపై నీళ్లు చల్లాడు. మరోవైపు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 188.57 స్ట్రైక్ రేట్తో 66 పరుగులు చేసి విజయ సమీకరణాన్ని సులభతరం చేశాడు. చివర్లో మార్కస్ స్టోయినిస్ (10 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్ (ఓవర్కు 18 పరుగులు), జస్ప్రీత్ బుమ్రా (ఓవర్కు 10.25 పరుగులు), శార్దూల్ ఠాకూర్ (ఓవర్కు 14 పరుగులు) ధారాళంగా పరుగులిచ్చారు. AM గజన్ ఫర్ మాత్రమే 2 వికెట్లు తీసి కాస్త పర్వాలేదనిపించాడు.

