కామారెడ్డి మున్సిపాలిటీలో బిల్లుల బాగోతం

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి(Kamareddy) మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపుల వ్యవహారంపై పలువురు మున్సిపల్ కౌన్సిలర్‌లు (Councillors) ఫిర్యాదు చేశారు. బిల్లుల చెల్లింపులలో అవకతవకలు జరుగుతున్నాయని, అధికారులు కమిషన్ తీసుకుని బిల్లులు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలతో ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించారు. కామారెడ్డి మున్సిపాలిటీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ గడ్డమీది మహేష్, 21వ వార్డు కౌన్సిలర్ తాటి లావణ్య ప్రసాద్, 14వ వార్డు కౌన్సిలర్ రాంశెట్టి హర్షితలు ఈ ఫిర్యాదు చేశారు. కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపులలో ప్రస్తుత మున్సిపల్ కమిషనర్, అకౌంటెంట్ వ్యవహారంపై విచారణ చేపట్టాలని వారు కోరారు.

విజిలెన్స్ అభ్యంతరాలు ఉన్న బిల్లులను కూడా రాస్తున్నారని ఆరోపిస్తూ, ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీలో శానిటేషన్, వాటర్ వర్క్స్, జనరల్ ఫండ్, 14వ, 15వ ఫైనాన్స్, స్పెషల్ డెవలప్‌మెంట్ నిధులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులపై పూర్తిస్థాయి పరిశీలన చేయాలని కోరారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం హైదరాబాద్, రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్, సీడీఎంఏ డైరెక్టర్, కామారెడ్డి జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)లకు ఫిర్యాదు చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత బిల్లుల చెల్లింపులను నిలిపివేయాలని కౌన్సిలర్‌లు  కోరారు. మున్సిపల్ కమిషనర్ పార్వతాలు, అకౌంటెంట్ రాములు వ్యవహారశైలిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>