కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ (మాతా శిశు ఆరోగ్య కేంద్రం)లో ఆదివారం ‘పల్స్ పోలియో’ (Pulse Polio) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొంతమంది చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 0 నుండి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 46 వేల మంది చిన్నారులకు 343 పోలియో బూత్ల ద్వారా పోలియో చుక్కలు వేయనున్నట్లు వెల్లడించారు. ఏదైనా కారణంతో బూత్ల వద్ద చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులను గుర్తించి, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. 5 సంవత్సరాల లోపు ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన వారు తమ ప్రాంతంలోని ఆశా వర్కర్ను సంప్రదించి చిన్నారులకు వెంటనే పోలియో చుక్కలు వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలో పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, ఇతర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, చిన్నారులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

