కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam), భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాల మధ్య విస్తరించిన అటవీ ప్రాంతాన్ని అటవీశాఖ సుందరంగా తీర్చిదిద్దుతూ పర్యాటకుల కోసం అభివృద్ధి చేసిన పులిగుండాల ఎకో-టూరిజం ప్రాజెక్టు (Puligundala Eco Tourism Project) ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకోనుంది. తల్లాడ రేంజ్ పరిధిలోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు విస్తరించి ఉంది. ఖమ్మం(Khammam) జిల్లా కల్లూరు, పెనుబల్లి మండలాల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని బాధ్యతాయుత పర్యాటకానికి అనువుగా తీర్చిదిద్దుతూ, పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ధి చేశారు.
సుమారు 27 కిలోమీటర్ల జంగిల్ సఫారి మార్గం ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పులిగుండాల ప్రాంతం, మినీ జలపాతం, చిరుత వీక్షణ టవర్ వంటి ప్రదేశాలను అనుసంధానం చేస్తూ సందర్శకులకు అటవీ సౌందర్యాన్ని దగ్గరగా అనుభవించే అవకాశం కల్పిస్తున్నారు. వర్షాకాలంలో భద్రతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని సఫారి నిర్వహణ చేపట్టనున్నారు. అలాగే పెడల్ బోటింగ్, టెంట్ స్టే, పక్షి వీక్షణ టవర్లు, వ్యూ పాయింట్లు, నక్షత్ర వీక్షణ వంటి ఎకో-ఫ్రెండ్లీ వినోద సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో ప్రముఖ ఎకో-టూరిజం గమ్యస్థానంగా అభివృద్ధి చెందే అవకాశముందని డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ప్రాజెక్టును నిర్వహించడం ద్వారా పర్యాటక అభివృద్ధితో పాటు పర్యావరణ అవగాహన పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పులిగుండాల ఎకో-టూరిజం ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు.

