కలం, వెబ్ డెస్క్: సిరిసిల్ల (Sircilla) నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు చేదు అనుభవం ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సిరిసిల్లకు వెళ్లగా, స్థానిక ప్రజలు ఆయనను అడ్డుకుని నిలదీశారు. గత 17 ఏళ్లుగా ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కనీస మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊర్లో కనీసం నడవడానికి రోడ్లు లేవని, మురుగు నీరు వెళ్లేందుకు మోరీలు కూడా నిర్మించలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా తాగునీటి సమస్యపై స్థానికులు కేటీఆర్ను గట్టిగా ప్రశ్నించారు. గతంలో ఎన్నికల సమయంలో నీళ్ల కోసం బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తలేదని స్థానికులు మండిపడ్డారు. “పనులు చేయకుండా కేవలం ఓట్ల కోసమే మళ్ళీ వస్తున్నారా?” అంటూ కేటీఆర్ను నిలదీయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని కేటీఆర్ను (KTR) ప్రజలు ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది.
Read Also: బీజేపీ - బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం : సీఎం రేవంత్
Follow Us On: Sharechat


