కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పుట్టబోయే బిడ్డపై అనుమానంతో భర్త, అత్త వేధించడంతో మనస్తాపానికి గురైన ఓ గర్భిణి బలవన్మరణానికి (Pregnant Woman Dies) పాల్పడింది. ఈ విషాదకర ఘటన అల్లాదుర్గ్ మండలం గడిపెద్దపూర్ గ్రామంలో వెలుగుచూసింది.
గడిపెద్దపూర్ గ్రామానికి చెందిన అభిలాష్తో సుస్మితకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ప్రస్తుతం సుస్మిత ఐదు నెలల గర్భిణి. అయితే, భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త అభిలాష్, అత్త కలిసి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించారు. గర్భంలోని శిశువు తమదేనా కాదా అని తేల్చాలంటూ, డీఎన్ఏ టెస్టు చేయించుకోవాలని సుస్మితపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు.
భర్త, అత్తల వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన సుస్మిత ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

