కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో మావోయిస్టుల ముప్పు దాదాపుగా తొలగిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం వీఐపీల భద్రత (Telangana VIP Security)పై కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్రంలోని 100 మందికి పైగా ప్రజాప్రతినిధులు, ప్రముఖుల సెక్యూరిటీని జులై 1 నుంచి తగ్గించనున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 600 మంది వీఐపీలకు ప్రభుత్వ భద్రత కొనసాగుతోంది. అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించిన నాయకులు, అలాగే పదవీ విరమణ చేసిన మాజీ పోలీసు అధికారులకు కేటాయించిన బుల్లెట్ప్రూఫ్ వాహనాలు, గన్మెన్లను ఉపసంహరిస్తూ ఉన్నతాధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

