కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ నేతలకు రాజీవ్ గాంధీ విగ్రహం మీదున్న శ్రద్ధ పీవీ నరసింహారావు (PV Narasimha Rao) విగ్రహం మీద ఎందుకు లేదని బీజేపీ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వ నిధులతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. కరీంనగర్ జిల్లా నుండి దేశ ప్రధానిగా ఎదిగి, దేశ గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించిన పీవీ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో మొక్క నాటిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
పీవీని అవమానిస్తారా?
కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని ‘పీవీ’ కి అవమానం చేసేలా కాంగ్రెస్ వ్యవహరించడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజాధనంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసి.. ఇదే జిల్లా గడ్డపై పుట్టి దేశప్రధానిగా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించిన ‘భారత రత్న’ పీవీని ఎందుకు మరిచిపోయారని ప్రశ్నించారు. గాంధీలకు ఒక న్యాయం .. మరొకరి విషయంలో అన్యాయం చేసేలా వ్యవహరించడమే కాంగ్రెస్ సంస్కృతి అన్నారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ అధ్యక్షుడు జాడి బాల్ రెడ్డి, మాటూరు వెంకటస్వామి, కాసం సంతోష్, రుద్ర లక్ష్మణ్, సుమంత్, పిట్టల మధు, సుగుణాకర్ రెడ్డి, రవీందర్, సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, బాలు ఎలిగేటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

