కలం, వెబ్ డెస్క్: నార్వే చెస్ టోర్నీ ఛాంపియన్ గెల్చుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పిన ప్రజ్ఞానంద (Praggnanandhaa) తమిళనాడు సీఎం విజయ్ను మర్యాదపూర్వకంగా కలిశాడు. తల్లిదండ్రులతో కలిసి సచివాలయానికి వచ్చిన ప్రజ్ఞానందకు ముఖ్యమంత్రి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకటించిన రూ.50 లక్షల నగదు బహుమతి చెక్కును అందించి భవిష్యత్తులో మరిన్ని టైటిల్స్ సాధించి రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ కాసేపు ప్రజ్ఞానందతో చెస్ ఆడి, ఎత్తులు వేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రజ్ఞానంద చెస్ నైపుణ్యానికి మురిసిపోయారు.
ప్రజ్ఞానంద అరుదైన రికార్డ్..
విశ్వనాథన్ ఆనంద్, గుకేశ్ లాంటి ప్రపంచ ఛాంపియన్లు సైతం ఇంతవరకు నార్వే చెస్ టోర్నీని గెలుచుకోలేకపోయారు. 20 సంవత్సరాల ప్రజ్ఞానంద మాత్రం ఈ ఫీట్ సాధించి, అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. మేటి ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ను పలుమార్లు ఓడించిన ప్రజ్ఞానంద.. తీవ్ర ఒత్తిడిలో ఫైనల్ మ్యాచ్లో జర్మనీ ప్లేయర్ విన్సెంట్ కీమర్పై నెగ్గి ఛాంపియన్గా అవతరించాడు.

