కలం, వెబ్ డెస్క్: జగిత్యాల నియోజకవర్గంలో చాలా రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy), ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) మధ్య పచ్చగడ్డవేస్తే భగ్గున మండుతోంది. నిత్యం ఆధిపత్యపోరు, వివాదాలతో ఈ నియోజకవర్గం అట్టుడుకుతున్నది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో వివాదం తారస్థాయికి చేరుకున్నది. పార్టీ బీఫామ్స్ కోసం ఇద్దరు నేతలు విపరీతంగా ప్రయత్నించారు. ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ అంటూ ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే ఇద్దరు నేతలు తమ మద్దతు దారులకు స్వతంత్రంగా నిలబెట్టారు.
జగిత్యాల మున్సిపల్ (Jagtial Municipality) ఎన్నికల్లో మొత్తం 50 వార్డులు ఉండగా, కాంగ్రెస్ పార్టీ 23 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే మ్యాజిక్ ఫిగర్ 26 సీట్లుకు ఒక సీటు తక్కువ పడింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి 14 సీట్లు, జీవన్ రెడ్డి వర్గానికి 9 సీట్లు దక్కాయి. అదనంగా, 15 మంది స్వతంత్రులు గెలిచారు. వీరిలో 9 మంది జీవన్ రెడ్డి వర్గానికి మద్దతుదారులు, నలుగురు సంజయ్ వర్గానికి చెందినవారు. మిగిలిన సీట్లు బీఆర్ఎస్ (6), బీజేపీ (4), ఎంఐఎం (2)కు వెళ్లాయి. కాంగ్రెస్ బీ ఫాం మీద గెలుపొందిన నేతలు, స్వతంత్రులు, ఎంఐఎం కౌన్సిలర్లతో కలిపి 23 మందితో ఎమ్మెల్యే సంజయ్ క్యాంపునకు బయలు దేరగా.. శనివారం తన వర్గంలోని 14 మంది కౌన్సిలర్లతో మాజీ మంత్రి జీవన్రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు.
జీవన్ రెడ్డి (Jeevan Reddy) తన వర్గానికి చెందిన కౌన్సిలర్లతో కలిసి హైదరాబాద్లోని ప్రజాభవన్కు చేరుకుని, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సెక్రటరీని కలిశారు. ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో జీవన్ రెడ్డి, జగిత్యాల నాయకుల ముందు రెండు కీలక ప్రతిపాదనలు చేశారు. మొదటి ప్రతిపాదన ప్రకారం, చైర్మన్ పదవిని సంజయ్ వర్గానికి ఇచ్చి, వైస్ చైర్మన్ పదవిని జీవన్ వర్గానికి కేటాయించాలని సూచించారు. రెండో ప్రతిపాదనగా, మున్సిపల్ టర్మ్ (5 ఏళ్లు)ను రెండున్నర ఏళ్ల చొప్పున ఇరు వర్గాలు పంచుకునేలా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాంగ్రెస్ జెండా మోసిన వారికే చైర్మన్ పీఠం ఇవ్వాలని జీవన్ రెడ్డి పట్టుబట్టారు.
Read Also: కరీంనగర్ టు హైదరాబాద్ : క్యాంపు రాజకీయం
Follow Us On: Sharechat


