కలం, వెబ్ డెస్క్: త్రివిక్రమ్ శ్రీనివాస్, పూజా హెగ్డేల (Pooja Hegde) క్రేజీ కాంబినేషన్ టాలీవుడ్లో మరోసారి సందడి చేయబోతుందనే వార్త ఆసక్తిగా మారింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన అరవింద సమేత, అల వైకుంఠపురములో లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. అనివార్య కారణాల వల్ల గుంటూరు కారం సినిమా నుంచి పూజా తప్పుకోవడంతో ఈ కాంబోకు కాస్త బ్రేక్ పడింది. తాజాగా విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమాలో పూజా హెగ్డేను ఒక ప్రత్యేక గీతం (Special Song) కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో కథా పరంగా వచ్చే ఒక మాస్ మసాలా సాంగ్లో పూజా అయితేనే పర్ఫెక్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఒకవేళ ఈ డీల్ ఓకే అయితే, వెంకటేశ్తో కలిసి పూజా హెగ్డే స్టెప్పులేయడం పక్కా. అటు త్రివిక్రమ్ (Trivikram) మేకింగ్, ఇటు పూజా గ్లామర్ తోడైతే ఆ పాట థియేటర్లలో ప్రేక్షకులకు కనువిందు చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

