కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పోలీసు శాఖలో పదోన్నతులపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. పోలీసు శాఖలో ఖాళీలు ఎక్కడెక్కడ వస్తాయో దాని ప్రకారం ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వేకెన్సీలు లేనప్పుడు వారికి సంబంధించి ఆర్థిక పరంగా నష్టం జరగొద్దని ఆరేళ్లు, పన్నెండేళ్లు, పద్దెనిమిదేళ్లు… ఇలా సంవత్సరాల వారీగా సర్వీసు చేసిన వారికి ఆర్థిక పరంగా చేకూరాల్సిన లబ్ధిని ప్రభుత్వం అందజేస్తుందని హామీ ఇచ్చారు. కానిస్టేబుళ్లు, పోలీసులకు వేకెన్సీలు ఉన్నప్పుడు మాత్రమే ప్రమోషన్లు ఇస్తామని స్పష్టం చేశారు.
పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్రంలో అందరూ ప్రశాంతంగా ఉన్నారంటే కారణం పోలీసులేనని పొన్నం వ్యాఖ్యానించారు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మంత్రి అభినందనలు తెలియజేశారు. జోనళ్ల వారీగా పోలీసుల రిక్రూట్మెంట్ జరుగుతుందని, క్యాడర్ స్ట్రెంత్ ప్రకారంగా ఉన్న పోస్టుల ఆధారంగా ప్రమోషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, ఈ విషయం మాజీ హోంమంత్రికి కూడా తెలుసునని వ్యాఖ్యానించారు.

