కలం, వెబ్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ను ఇటీవల ఆదిత్యా బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆర్సీబీ కొత్త యజమానులకు విజయ్ మాల్యా (Vijay Mallya) హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ (IPL)లో అత్యంత విలువైన ఈ ఫ్రాంచైజీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 2008లో తాను రూ.450 కోట్లకు ఈ జట్టును కొనుగోలు చేసినప్పుడు, చాలామంది తన నిర్ణయాన్ని చూసి నవ్వుకున్నారని, అది కేవలం ఎంజాయ్మెంట్ ప్రాజెక్ట్ అని విమర్శించారని గుర్తు చేసుకున్నారు. అయితే తన బ్రాండ్ను నిర్మించాలనే లక్ష్యంతోనే రాయల్ ఛాలెంజ్ పేరు మీద దీనిని ప్రారంభించానని, నేడు ఆ పెట్టుబడి రూ.16,500 కోట్లకు చేరడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆర్సీబీ జట్టు ఎప్పటికీ తన డీఎన్ఏలోనే ఉంటుందని, ఆ జ్ఞాపకాలను ఎన్నటికీ మర్చిపోలేనని మాల్యా అన్నారు. ముఖ్యంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని చిన్న వయసులోనే జట్టులోకి ఎంపిక చేయడం, నేడు అతను ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఎదగడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన హయాం నుండి ఇప్పటి వరకు జట్టును ఆదరిస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, బెంగళూరు సింహం లాంటి ఆర్సీబీకి ఎల్లప్పుడూ మద్దతుగా నిలవాలని కోరారు.

