కలం, వెబ్ డెస్క్: మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) మరో గుడ్ న్యూస్ చెప్పింది. బీసీ మహిళల స్వయం ఉపాధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధి కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉత్పాదకతను పెంచి, టైలరింగ్ వ్యాపార అవకాశాలను విస్తరించుకునేందుకు, మహిళలు స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు వంద శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లు మంజూరు చేయనున్నారు. పథకం అమలు పై బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు,ఇతర అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలో కుట్టు మిషన్ల కోసం మహిళల నుంచి అప్లికేషన్లు తీసుకొని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేద మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

