Mobile Popup Ad
Mobile Popup Ad

సచివాలయంలో పొంగులేటి భేటీ: కలెక్టర్లకు కీలక సూచనలు

కలం, వెబ్ డెస్క్​ : తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti) నూతనంగా బాధ్యతలు చేపట్టిన పలు జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతోందని, ఆ ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లా యంత్రాంగం పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడి దరికి చేరేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని ఆయన తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమం అనే రెండు అంశాలను సమన్వయం చేసుకుంటూ పాలన సాగించాలని మంత్రి సూచించారు. ఐఏఎస్ అధికారుల కెరీర్‌లో జిల్లా కలెక్టర్లుగా పనిచేయడం అత్యంత కీలకమైన ఘట్టమని, ఈ సమయంలో ప్రజలతో నేరుగా మమేకమై వారి అవసరాలను అర్థం చేసుకోవాలని కోరారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేవలం నిబంధనలకే పరిమితం కాకుండా మానవీయ కోణంలో ఆలోచించాలని, ప్రజలకు మేలు చేసే పనులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికార యంత్రాంగం ఒక టీమ్ లాగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో వచ్చే అనుభవాలే భవిష్యత్తులో ఉన్నత బాధ్యతలు నిర్వహించడానికి పునాదులని పేర్కొన్నారు. ఈ భేటీలో జోగులాంబ గద్వాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ తదితర జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>