కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ఖజానాలో కష్టమున్నా నిరుపేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రజల దీవెనలతో ఏర్పడిన ఈ ప్రజా ప్రభుత్వంలో పేదల వైద్యం, విద్యకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం ఉన్నా సరే.. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నామని చెప్పారు.
కోనాయిగూడెంలో రూ. 34 లక్షల వ్యయంతో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహ పాఠశాల, జూనియర్ కళాశాల భవన మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి కల్పించడం ప్రభుత్వ బాధ్యతని, విద్యా సంస్థల బలోపేతానికి నిధుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఏప్రిల్ ఆఖరు లేదా మే మొదటి వారంలో రెండో విడత మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. అర్హులైన ప్రతి నిరుపేదకూ మూడు విడతల్లో పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
హమాలీలను పలకరించిన పొంగులేటి..
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మానవత్వం చాటుకున్నారు. ఆపదలో ఉన్నామన్న సామాన్యుడికి ‘నేనున్నానంటూ’ భరోసా ఇచ్చారు. శుక్రవారం నేలకొండపల్లి మండల పర్యటన నిమిత్తం వెళ్ళి ఖమ్మం తిరిగి వస్తున్న మంత్రి బుద్దారం గ్రామం సమీపంలో రోడ్డుపై ధాన్యం తూకం వేస్తున్న హమాలీలను చూసి తన వాహనాన్ని ఆపారు. ప్రొటోకాల్ ఆడంబరాలు పక్కన పెట్టి నేరుగా హమాలీల వద్దకు వెళ్లిన మంత్రి వారితో కలిసి సరదాగా ముచ్చటించారు. “పనులు ఎలా జరుగుతున్నాయి? ఆదాయం సరిపోతుందా? ఇంట్లో అందరూ క్షేమమేనా?” అంటూ ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించారు. మంత్రి స్వయంగా తమ వద్దకు వచ్చి పలకరించడంతో హమాలీలు సంతోషం వ్యక్తం చేశారు.

