కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించి సమగ్ర సర్వే కార్యక్రమం చేపడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy,) స్పష్టం చేశారు. ఈ సారి ప్రత్యేకంగా కలెక్టర్లు/అదనపు కలెక్టర్లు, డిఎఫ్ఓలను సమావేశపరిచి రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులపై చర్చించి రోవర్ల సాయంతో సరిహద్దుల గుర్తింపుపై ఒక అవగాహన కల్పించామని చెప్పారు. సరిహద్దులను కచ్చితంగా ఖరారు చేసేలా అధికారులను ఆదేశించామన్నారు. రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల నుంచి రెవెన్యూ ఫారెస్ట్ మధ్య భూ సరిహద్దు వివాదాలు ఉన్నాయని.. వీటి పరిష్కారానికి జయింట్ సర్వే నిర్వహించి శాశ్వ పరిష్కారం చూపబోతున్నామని చెప్పారు.
భూ రిజిస్ట్రేషన్ల సమయంలో సర్వర్ల డౌన్ అంశంపై దృష్టి సారించి కొత్త సాఫ్ట్ వేర్ ఏర్పాటుకు టెండర్లు పిలిచామని మంత్రి పొంగులేటి వివరించారు. సుమారు 14.08 కోట్లతో టెండర్ ఖరారు అయిందని.. మరో 3-4 నెలల్లో ఈ సమస్య తీరుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్దీకరించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీనికి అనుగుణంగా ఈనెల చివరిలోగా భూముల ధరలను సవరించి అమలులోకి తీసుకువస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2022లో ఆరునెలలు తిరగకుండానే రెండు సార్లు భూముల ధరలను అశాస్త్రీయ పద్దతిలో పెంచారని విమర్శించారు. ఆర్ధిక నిపుణులైన అరవింద్ సుబ్రహ్మణ్యం సలహాలు, సూచనల మేరకు శాస్త్రీయ పద్దతిలో విశ్లేషించి భూముల ధరలను సవరిస్తున్నామన్నారు.

