కలం, జోగులాంబ గద్వాల: గద్వాల జిల్లాలోని నడిగడ్డ ఇలవేల్పు అయిన శ్రీ జమ్ములమ్మ అమ్మవారి దేవాలయ (Jammulamma Temple) పరిసరాల్లో హిందూ సాంప్రదాయాల పరిరక్షణ కోసం భక్తులు “హలాల్ వద్దు – జట్కా ముద్దు” అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దేవాలయ ప్రాంగణంలో మన సంస్కృతి, సాంప్రదాయాలు వర్ధిల్లాలనే సత్సంకల్పంతో గత మంగళవారం, శుక్రవారం రోజుల్లో హిందూ సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని భక్తులు ప్రశాంతంగా నిర్వహించారు.
అయితే, మంగళవారం నాటి కార్యక్రమానికి భక్తులు సిద్ధమవగా.. పోలీసులు రంగప్రవేశం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించకూడదని గట్టిగా అడ్డుకున్నారు. కొందరు అధికార పార్టీ నాయకులు మన దేవాలయాల వద్ద మన సాంప్రదాయాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తూ, తమపై కక్ష సాధింపు చర్యగా పోలీసులు ఈ రోజు కార్యక్రమాన్ని బలవంతంగా నిలిపివేయించారని నిర్వాహకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
హిందు ఆలయాల వద్ద భక్తుల నమ్మకాలను, సాంప్రదాయాలను గౌరవించాల్సింది పోయి.. కేవలం రాజకీయ ఒత్తిళ్లకు లొంగి భక్తులను అణచివేయాలని చూడటం దురదృష్టకరమని భక్తులు మండిపడుతున్నారు. తమ ఇలవేల్పు దేవాలయ ప్రాంగణంలో సాంప్రదాయ కార్యక్రమాలను అడ్డుకోవడంపై భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భక్తుల భావాలను గౌరవించాలని, సాంప్రదాయ కార్యక్రమాలకు ఆటంకం కలిగించకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

