కలం, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా సైబర్ క్రైమ్ నెట్వర్క్ను ఛేదించడానికి పోలీస్ శాఖ ప్రత్యేక ఆపరేషన్ ‘ఆపరేషన్ క్రాక్డౌన్’ (Operation Crackdown)ను ప్రారంభించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) రూపొందించిన ఆపరేషన్ క్రాక్డౌన్లో వరుస కార్యక్రమాలు ఉండబోతున్నాయి. TGCSB, జిల్లాలు, కమిషనరేట్ల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరాలను నియంత్రించనుంది. ఇందులో భాగంగా మొదటి ఆపరేషన్ బుధవారం 16 జిల్లాల్లో ప్రారంభమైంది. ప్రత్యేకంగా తెలంగాణ అంతటా మ్యూల్ బ్యాంక్ ఖాతాలను లక్ష్యంగా చేసుకుంది. TGCSB డేటా విశ్లేషణలో 2025లో రాష్ట్రంలో 4775 మ్యూల్ ఖాతాలు నిర్వహించబడ్డాయని తేలింది. ప్రస్తుత ఆపరేషన్లో భాగంగా 16 జిల్లాల్లో విస్తరించి ఉన్న 137 బ్యాంకు శాఖల్లో తెరిచిన 1888 అనుమానిత మ్యూల్ ఖాతాలను తనిఖీ చేస్తున్నారు. ఈ ఖాతాలు దేశవ్యాప్తంగా 9431 నేర సంబంధాలతో ముడిపడి ఉన్నాయి. వీటిలో తెలంగాణలో 782 ఉన్నాయి.
ఆపరేషన్ డ్రైవ్లో 512 మంది అధికారులతో కూడిన 137 పోలీసు బృందాలు పాల్గొన్నాయి. ఈ బృందాలు 137 బ్యాంకు శాఖలను సందర్శించి తనిఖీ చేసి, అనుమానిత ఖాతాదారుల KYC వివరాలను సేకరించాయి. కొన్ని సందర్భాల్లో వందల కొద్దీ ఖాతాలు ఉన్నాయని, ఇది బ్యాంకు సిబ్బంది. ఏజెంట్ల వ్యవస్థీకృత నెట్వర్క్ కుట్రకు సంబంధించిన అనుమానాన్ని కలిగిస్తోందని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ నుంచి పనిచేస్తున్న ఒకే ఖాతా బహుళ అధికార పరిధిలోని 496 నేర ఫిర్యాదులతో సంబంధం కలిగి ఉన్నట్లు గుర్తించారు. సూర్యాపేట జిల్లాలో నాలుగు బ్యాంకు శాఖల్లో 298 ఖాతాలు లింక్ చేయబడి ఉన్నాయని తేలింది. అలాగే సాంకేతిక సామర్థ్యం లేని కొన్ని చిన్న బ్యాంకులు జాతీయ బ్యాంకుల RTGS ని ఉపయోగిస్తున్నాయని పోలీసులు గుర్తించారు.
సైబర్ ఖాతా నెట్వర్క్లను నిర్వీర్యం చేయడానికి , అంతర్ రాష్ట్ర సైబర్ ఆర్థిక మోసాలను నిరోధించడానికి తెలంగాణ పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ క్రాక్డౌన్’ను ప్రారంభించినందుకు TGCSB డైరెక్టర్ శిఖా గోయెల్ను DGP అభినందించారు.

