కలం, వెబ్ డెస్క్ : మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై కేసు నమోదయింది. మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్ (Konda Surekha Former OSD Sumanth) వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారాడు. హత్యాయత్నం కింద ఆయనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలోనే సుమంత్ పై పలు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఓ వ్యాపారిని తన డెన్కు పిలిపించి ఏకంగా రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
తాను డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేసినట్లు వ్యాపారి గొంగిడి హరికృష్ణ మేడిపల్లి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయగా ఆ కేసు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయింది. 109 సెక్షన్ కింద సుమంత్ పై కేసు నమోదు కాగా, మరో ఐదుగురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, గతంలో మంత్రి కొండా సురేఖకు ఓఎస్డీగా సుమంత్ పని చేశారు. ఆ సమయంలో ఆయనపై పలు తీవ్రమైన ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం, అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, కాలుష్య కారక పరిశ్రమల విషయంలో నేరుగా జోక్యం చేసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. అలాగే, ఓ సిమెంట్ కంపెనీ యజమానిని గన్ తో బెదిరించారనే ఆరోపణలు వచ్చాయి.
దీంతో సుమంత్ ను ఓస్డీ బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సంపత్ ను కొండా సరేఖ కూతురు సుస్మిత వెనకేసుకొచ్చారు. ఈ విషయం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తాజాగా, సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే కొండా సరేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.

