కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) గురువారం ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని నారాయణపురంలో పర్యటించారు. అక్కడ నిర్వహిస్తున్న ‘భూభారతి’ భూ సర్వే ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో ముఖాముఖిగా మాట్లాడి, సర్వే ఎలా జరుగుతోంది, భూముల సమస్యల పరిష్కారం ఏ విధంగా ఉందో అని వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఓ రైతు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు.
రైతులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు అనే తేడా లేకుండా అందరి సంక్షేమం కోసం పని చేస్తూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ‘గ్రీన్ హీరో’గా మారారని కొనియాడారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అని, ఆయన రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం మంత్రి అయ్యారన్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా సీఎం పీఠం దక్కించుకుంటారని అన్నారు. దీంతో రైతు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

