కలం, వెబ్ డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill)పై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృ శక్తిని, నారీ శక్తిని దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళా ప్రజాప్రతినిధులకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అందరూ కోరుకుంటున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ సమావేశమైనప్పుడు ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని పిలుపునిచ్చారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అందరూ కలిసి ఒక పండుగలా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

