కలం, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు, రేపు పశ్చిమ బెంగాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు భారీ బహిరంగ సభ, రోడ్షోలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా హుగ్లీలో నిర్వహించనున్న పశ్చిమబంగ దివస్ వేడుకల్లో ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
రాష్ట్ర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేలా పలు నూతన పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని, ఇదే వేదికపై నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు లబ్ధి చేకూర్చనున్నారు. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా 23వ విడత పీఎం కిసాన్ నిధులను ఆయన పశ్చిమ బెంగాల్ వేదికగానే విడుదల చేయనున్నారు.
దీనితో పాటు రక్షణ రంగంలో దేశ స్వావలంబనను చాటిచెప్పేలా భారత నౌకాదళానికి చెందిన మూడు అధునాతన యుద్ధనౌకలు INS దూనగిరి, INS సంశోధక్, INS అగ్రయ్లను ప్రధాని మోదీ (PM Modi) జాతికి అంకితం చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

