కలం, వెబ్ డెస్క్: ఉగాది (Ugadi) పండుగను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) తెలుగు ప్రజలకు ప్రత్యేక లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వసంత కాలం తెచ్చే కొత్త ఉత్సాహం, ప్రకృతిలో వచ్చే మార్పులు మన జీవితాల్లో కొత్త అవకాశాలకు నాంది పలకాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా కష్టజీవులైన రైతన్నలు కొత్త సాగు కోసం ఎంతో ఆశతో, ఉత్సాహంతో సిద్ధమవుతున్న సమయమని ఆయన గుర్తు చేశారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ప్రధాని కోరుకున్నారు.
ఉగాది పండుగ విశిష్టతను వివరిస్తూ.. జీవితం అంటే కేవలం తీపి మాత్రమే కాదని, అన్ని రకాల రుచుల సమ్మేళనమని మోడీ పేర్కొన్నారు. ఉగాది పచ్చడి లాంటి సాంప్రదాయం మనకు జీవిత పరమార్థాన్ని బోధిస్తుందని, కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని, విజయం వరించినప్పుడు వినయంతో ఉండాలని సూచించారు. రాబోయే కాలంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తూ సమాజంలో శాంతిని, సానుకూలతను పెంపొందించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఇదే విధంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో నేడు చేసుకుంటున్న పండుగల సందర్భంగా మోడీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

