కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అధినేత ఇందిరాగాంధీ 2026 నాటికి విధించిన ఎమర్జెన్సీకి 51 ఏళ్లు నిండిన సందర్భంగా ప్రధాని మోడీ (PM Modi) ఎక్స్ (X) వేదికగా స్పందించారు. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ (Emergency 1975).. మన రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. ఆ సమయంలో పౌర స్వేచ్ఛల నిలిపివేత, భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సంఘ సేవకుల అరెస్టులు, అలాగే మన ప్రజాస్వామ్యానికి పునాదులైన సంస్థలపై దాడి జరిగాయని చెప్పారు. దేశ చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటైన ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య విలువలను దృఢంగా పరిరక్షించిన వారందరికీ నేడు నివాళులర్పిస్తున్నామని చెప్పారు.
అదే సమయంలో మౌనంగా ఉండటానికి నిరాకరించిన అసంఖ్యాక పౌరులు ధైర్యంతో మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలను నిలబెట్టారని గుర్తు చేశారు. 14 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, హక్కులు, విధులకు ప్రతిరూపం మన మన రాజ్యాంగం అని కొనియాడారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి దేశమంతా ఏకం కావాలని ఆకాంక్షించారు. మన రాజ్యాంగ స్ఫూర్తితో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే భారతదేశాన్ని నిర్మించుకోవాలని చెప్పారు.
దేశంలో శాంతి, భద్రతలను కాపాడేందుకు అత్యవసర సమయంలో ఎమర్జెన్సీని విధించేందుకు భారత రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. అసాధారణ పరిస్థితులు తలెత్తి, పాలనా యంత్రాంగంతో వాటిని పరిష్కరించలేనప్పుడు భారత రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధిస్తారు. దీనినే అత్యయిక పరిస్థితి, జాతీయ అత్యవసర పరిస్థితి అని కూడా అంటారు. ఎమర్జెన్సీ సమయంలో కొన్ని పౌర హక్కులనునిలిపివేసి ప్రత్యేక చట్టాలు రూపొందించి అమలు చేస్తారు. మన దేశంలో మొత్తం మూడుసార్లు ఎమర్జెన్సీ విధించినా 1975, జూన్ 25న కాంగ్రెస్ అధినేత ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో విధించిన ఎమర్జెన్సీని ఎక్కువగా ప్రస్తావిస్తారు. దేశం మొత్తానికి లేదా కొంత భాగానికి ఏదైనా అసాధారణ పరిస్థితి వల్ల ముప్పు వాటిల్లినప్పుడు ఎమర్జెన్సీ విధిస్తారు.

