కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ నగరంలో ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమై.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పుతిన్ చివరిసారి భారత్ పర్యటన ఎంతో ప్రత్యేకమే కాకుండా, చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఇరు దేశాల ప్రజల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు నిరంతరం పురోగతిలో ఉండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. రెండు దేశాల ప్రయోజనాలను కాపాడుకుంటూనే.. వ్యూహాత్మక రంగాల్లో వ్యవహరిస్తున్న తీరు కూడా అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగాలని ఆకాంక్షించారు.
రెండు దేశాలది ప్రత్యేక బంధం..
రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. రెండు దేశాలది ప్రత్యేక బంధమని, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రధాని మోదీ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు. ఇందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. వచ్చే ఏడాది రష్యా–భారత్ సంబంధాలకు 80 ఏళ్లు పూర్తవుతుండటం తనకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ఇటీవలే భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ మాస్కో వచ్చి తనను కలిసి వెళ్లారని, ప్రధాని మోదీ ప్రత్యేక సందేశాన్ని కూడా అందించారని పుతిన్ గుర్తు చేశారు.

