కలం, వెబ్ డెస్క్: చేయూత పింఛన్ పథకం (Cheyutha Pension Scheme)లో భాగంగా అర్హులైన పెన్షన్దారులకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకునే గడువును మరో 15 రోజులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో సెర్ప్ సీఈవో ఈ మేరకు సర్య్కులర్ జారీ చేశారు. వాస్తవానికి ఈ రోజుతోనే స్వీకరణ ప్రక్రియ ముగిసిపోనుంది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు మరో 15 రోజులు పెంచాలని మంత్రి సీతక్క నిర్ణయించారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
కొత్తగా 2.50 లక్షల మందికి..
రాష్ట్రంలోని వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులతో పాటు ఫైలేరియా, తలసీమియా, డయాలసిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న సుమారు 2.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్ట్ 9వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. దరఖాస్తుదారులు ఆధార్, రేషన్ కార్డులతో పాటు బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్, దివ్యాంగులైతే అందుకు వైద్య ధ్రువపత్రాలను జత చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు మరోసారి చేయాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పరిశీలన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయబోతుంది.

