కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ (Shadnagar) పట్టణంలోని బైపాస్ రోడ్డు యమ్మీ హోటల్ సమీపంలో ఉన్న HP పెట్రోల్ బంక్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం తీవ్ర కలకలం సృష్టించింది. బంకులో పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చిన కారులో పెట్రోల్ పోసిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కారులో పెట్రోల్ పోసిన అనంతరం సిబ్బంది పెట్రోల్ ను గన్ ను తొలగించలేదు. అది గమనించిన కారు యజమాని ముందుకు వెళ్లగా.. ఆ పెట్రోల్ గన్ కిందపడి రాపిడికి గురై మంటలు చెలరేగాయి. దీంతో బంక్లో ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి, అక్కడే ఉన్న అగ్నిమాపక పరికరాల సహాయంతో మంటలను త్వరగా అదుపులోకి తెచ్చారు. సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. పెట్రోల్ గన్ వల్లే మంటలు చెలరేగాయని నిర్ధారించారు.

