కలం, వెబ్డెస్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోందని, ఈ రెండేళ్లలో ప్రజలకు ఒక మంచి పని చేశామని చెప్పుకునే దమ్ముందా? అని మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ప్రశ్నించారు. సోమవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కల్యాణ్ గవర్నర్ బంగ్లా పక్కన ఆర్భాటంగా ప్రజా దర్బార్ అని చెప్పి బారికేడ్లు పెట్టారని నాని పేర్కొన్నారు. జగన్ను గతంలో పరదాల ముఖ్యమంత్రి అంటూ విమర్శలు చేశారని, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు పరదాలు కట్టుకొని కూడా ప్రజలకు దర్బార్లు నడిపే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జనానికి నాయకులు ఎవరూ అందుబాటులో లేరన్నారు. పవన్ కల్యాణ్, లోకేశ్, చంద్రబాబు కనీసం వాళ్ల పార్టీల నాయకులు, కార్యకర్తలకు కూడా దొరకడం లేదని తెలిపారు. ఇంతకు ముందు పీ త్రీ అనే వారు అని, ఇప్పుడు పీ 4 అని అంటున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ నాయకులు రెండేళ్లలో జగన్పై విమర్శలు చేయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, ఇకనైనా పనికి రాని విమర్శలు మానుకొని పాలనపై దృష్టి పెట్టాలని నాని హితవు పలికారు.

