కలం, వెబ్ డెస్క్ : ఏపీలో ఇంధన కొరత నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) విమర్శలకు దిగారు. గడిచిన మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరతతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పేద, మధ్యతరగతి జనాల బతుకులు నలిగిపోతున్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లకు స్పృహ లేకుండా పోతుందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని ఆరోపించారు. ఈ విపత్కర సమయంలో 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు అనుభవం ఏమైందని ఎద్దేవా చేశారు.
తనది 45 ఏళ్ల ఇండస్ట్రీ అని, దేశంలో తన కంటే అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి లేడని, ప్రధాని మోదీకి కూడా తనకంటే అనుభవం తక్కువే అని చెప్పుకునే చంద్రబాబు ఇంధన కోరత సమస్యపై ఎందుకు పరిష్కారం చూపించలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు రాష్ట్రం కోసం చంద్రబాబు తన పలుకుబడిని వాడడం లేదని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోయిందని విమర్శలు గుప్పించారు.

