కలం, వెబ్ డెస్క్: వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరుగనున్న తరుణంలో పుష్కర ఏర్పాట్లపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పుష్కరాలకు గోదావరి నదికి వచ్చే భక్తుల సౌకర్యాలపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పుష్కరాల సమయంలో భారీగా భక్తులు వచ్చే రాజమండ్రిలో ముమ్మర ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరంలోసోమవారం పర్యటించనున్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. దీనితోపాటుగా గోదావరి కాలుష్య నివారణ చర్యలపైనా రూట్ మ్యాప్ రూపొందించనున్నారు.
నేటి సాయంత్రం ఆయన రాజమండ్రికి చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించనున్నారు. పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులు సూచనలు చేయనున్నారు. అనంతరం రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధిలతో సమావేశమవుతారు. కాగా, పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను మంత్రి కందుల దుర్గేశ్, కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు.

