కలం, వెబ్డెస్క్: హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)జూబ్లీహిల్స్లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నివాసంలో ఆయనను పరామర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రధాని తన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు పవన్ వెల్లడించారు. ప్రధానికి తన భార్య అన్నా కొణిదెల, పిల్లలు అకీరా నందన్, ఆద్యా, పోలినా అంజని, మార్క్ శంకర్లతో కలిసి స్వాగతం పలికినట్లు చెప్పారు. దేశాధినేతగా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తనపై ఉన్న ప్రత్యేక అభిమానంతో ఇంటికి వచ్చి పరామర్శించడం తనను ఎంతో కదిలించిందని పవన్ భావోద్వేగానికి గురయ్యారు.
ఏప్రిల్ 19న తన సర్జరీ జరిగిన వెంటనే ప్రధాని ఫోన్ చేసి ధైర్యం చెప్పారని, ఇప్పుడు కోలుకుంటున్న సమయంలో స్వయంగా రావడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని పవన్ కొనియాడారు. ప్రతి ఒక్కరినీ తన కుటుంబ సభ్యుడిలా భావించే మోదీ నాయకత్వం, ఆయనలోని మానవత్వం కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. తన కుటుంబంతో గడిపిన ఈ మధుర క్షణాలు, ప్రధాని అందించిన ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ప్రత్యేకమని పేర్కొంటూ ప్రధానికి పవన్ కృతజ్ఞతలు తెలియజేశారు.

