కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల కోసం నూతన ఆర్జిత సేవను ప్రారంభించినట్లు యాదాద్రి ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. శివాలయం కొండపై ప్రతి అష్టమి తిథి పర్వదినాలలో పర్వతవర్ధిని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. శుక్ల అష్టమి, బహుళ అష్టమి రోజులలో అమ్మవారికి విశేష అభిషేకం, కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి.
ఈ సేవ కోసం టికెట్ ధర రూ.500గా నిర్ణయించగా, ఒక టికెట్పై ఇద్దరు (దంపతులు) పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. ప్రతి అష్టమి రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఈ సేవ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన ఈ విశేష అభిషేక సేవను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం అధికారులు కోరారు. నిర్ణీత రుసుము చెల్లించి సేవలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని సూచించారు.

