కలం, వెబ్ డెస్క్: ఏపీ హోమ్ శాఖ మంత్రి అనితపై చేసిన వ్యాఖలు అభ్యంతరకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేయడమంటే సగటు మహిళలను కించపరచడమే అవుతుందని చెప్పారు. మంత్రి అనిత (Minister Anitha)పై ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని.. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. మహిళల కట్టూబొట్టుపై కామెంట్స్ చేసే స్థాయికి ఆ నాయకుడి పార్టీవారు దిగజారిపోయారని విమర్శించారు. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలు కేవలం అనిత గురించి అన్నట్లే కాదని.. సగటు మహిళలందరినీ కించపరచినట్లే అవుతుందని చెప్పారు. ప్రజా జీవితంలో ఉన్నవారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తోందనే విషయాన్ని మరచిపోవద్దని తెలిపారు.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయని.. అవి విధానపరంగానే ఉండాలని అభిప్రాయపడ్డారు. ఒక పాలసీ నచ్చకపోతే ఆ పాలసీ విషయంపైనే విమర్శించాలని చెప్పారు. వాచలత్వంతో ఇళ్లలోని స్త్రీలను సైతం కించపరచే నైజం ఉన్న పార్టీ చేసే కామెంట్స్ ను బలంగా తిప్పికొట్టేటప్పుడు.. వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యల్లో ఎంతటి అభ్యంతరకరమైన విషయం ఉందో ప్రజలకు తెలియచెప్పాలని కూటమి నేతలందరికీ సూచించారు. కూటమి నేతలందరూ పౌర సమాజం హర్షించే భాషలో మాట్లాడి బలంగా బదులివ్వాలని సూచించారు. అవతలి పార్టీవాళ్ళ మాదిరి దిగజారుడు భాష, ఆర్థరహిత వ్యాఖ్యలు కూటమికి అవసరం లేదని పేర్కొన్నారు.
ఏపీ రాజకీయాల్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి చేసిన “మేకప్ మంత్రి” వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మాజీమంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మేరకు స్పందించారు.

