కలం, వెబ్ డెస్క్: తీగ లాగితే డొంకంతా కదిలినట్లు అన్నట్లుగా ఓ అవినీతి అధికారి అక్రమాస్తులు బయటికి వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణతో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో కట్టలు కట్టలుగా డబ్బు బయటపడింది. హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాకలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి భారీ సోదాలతో విరుచుకుపడ్డారు. ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ మల్టీజోన్-2 డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న సుంకరి నరహరి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. సుంకరి నరహరి నివాసాలతో పాటు 12 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో రూ.32 లక్షల నగదు, భారీగా ఆస్తులు, బ్యాంకు డిపాజిట్ల పత్రాలను స్వాధీనం చేసుకుని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

