కలం, వెబ్ డెస్క్: నీట్ పేపర్ లీకేజీ (Neet Paper Leak) ఘటనపై పార్లమెంటరీ స్థాయీ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడి పడి ఉన్న ఈ పరీక్ష పేపర్ పదే పదే ఎందుకు లీకవుతోందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్పై విద్య, మహిళల పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో లీకైనప్పుడే ఎందుకు పటిష్ఠ చర్యలు తీసుకోలేదని మండిపడింది. విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం చేసే ఎలాంటి చర్యలను ఉపేక్షించవద్దని హెచ్చరించింది.
ఏజెన్సీలపై ఆధారపడబోమన్న ఎన్టీఏ..
నీట్ పేపర్ లీక్ ఘటనపై ఎన్టీఏ డీజీ అభిషేక్ సింగ్ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి వివరణ ఇచ్చారు. అసలు ఈ పేపర్ ఎలా లీకైందో.. సమగ్ర సమాచారాన్ని సంఘానికి అందించారు. ఇక నుంచి ఎన్టీఏ అంతర్గత వ్యవస్థలపై పూర్తి స్థాయి పర్యవేక్షణ చేస్తామని స్పష్టం చేశారు. లీకేజీలు జరగకుండా ఉండేందుకు, వచ్చే ఏడాది నుంచి పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షగా మార్చేస్తామని వెల్లడించారు. బయట ఏజెన్సీలపై ఆధారపడటం పూర్తిగా తగ్గించి.. సొంత వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

