కలం, వెబ్ డెస్క్: ఎముకల నిర్మాణానికి అత్యంత ముఖ్యమైన కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనపడతాయని మనందరికి తెలుసు. అయితే, కేవలం కాల్షియం లోపమే కాకుండా ఇతర అనేక కారణాల వల్ల కూడా ఎముకలు బలహీన పడతాయని మీకు తెలుసా? అవును నేటి ఆధునిక కాలంలో తప్పుడు జీవనశైలి వల్ల కూడా ఎముకలు బలహీనపడే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.
సాధారణంగా కాల్షియం లోపం ఏర్పడినా, లేదా వయసు పెరిగే కొద్దీ సాంద్రత తగ్గి ఎముకలు గుల్లబారిపోతాయి. కానీ నేటి కాలంలో యువతీ, యువకులు కూడా ఎముకల నొప్పులు, బలహీనత, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలను ఎందుర్కొంటున్నారు. ఎముకల ఆరోగ్యం (Bone Health) పై ప్రభావం చూపే ప్రధాన కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎముకలు బలహీన పడటానికి గల కారణాలు:
1. విటమిన్ డి లోపం: విటమిన్ డి లోపం వల్ల ఎముకలు మెత్తబడతాయి. మనం తిన్న ఆహారం నుంచి కాల్షియంను శరీరం గ్రహించాలంటే విటమిన్ డి చాలా ముఖ్యం. అయితే ఎండ తగలక పోవడం వలన విటమిన్ డి లోపిస్తుంది. దీనివల్ల ఎములకు బలహీన పడతాయి. అందుకే ప్రతిరోజు కనీసం 15 నిమిషాల పాటు ఎండలో ఉండటం అవసరం.
2.శారీరక శ్రమ లేకపోవడం: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగాలు, వ్యాపారాల బిజీ వల్ల చాలామందికి వ్యాయామం చేయడానికి సమయం దొరకడం లేదు. దీనికి తోడు ఆఫీసుల్లో రోజంతా గంటల తరబడి కూర్చోవడం వల్ల శరీరానికి కనీస శ్రమ కూడా ఉండడం లేదు. ఈ కారణం వల్ల కూడా ఎముకలు త్వరగా బలహీనపడతాయి.
3. ధూమపానం, మద్యపానం: సిగరెట్లు, బీడీలు తాగే అలవాట్లు శరీరం కాల్షియంను గ్రహించకుండా అడ్డుకుంటాయి. శరీరం కాల్షియంను గ్రహించకపోతే ఎముకలు బలహీనపడతాయి. అంతే కాకుండా మితిమీరిన ఆల్కహాల్ తాగడం వల్ల కూడా ఎముకల పునరుత్పత్తి ప్రక్రియ దెబ్బతెంటుంది.
4. మందుల ప్రభావం: కీళ్లనొప్పులు, ఆస్తమా, అలర్జీల కోసం మందులు ఎక్కువకాలం పాటు వాడటం వలన ఎముకలు బలహీన పడే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.
అందుకే ప్రతిరోజూ వాకింగ్, జాగింగ్ చేయడం, మెట్లు ఎక్కడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం వలన ఎముకలు ధృడంగా మారుతాయి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, రోజూ కొద్దిసేపు ఎండలో గడపడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుంది. అంతే కాకుండా పాలు, పెరుగు, పనీర్, బాదంపప్పు, నువ్వులు వంటి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ విధంగా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఎముకలను బలంగా ఉంచుకోవాలని చెబుతున్నారు.

