కలం, మెదక్ బ్యూరో : ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏ పెట్రోల్ బంకు చూసిన జనాలతో కిక్కిరిపోయింది. పెట్రోల్, డీజిల్ కొరత (Fuel Shortage) అంటూ రకరకాల వార్తలు ప్రచారం జరగడంతో ఎక్కడ చూసినా ఇంధనం కొసం ప్రజలు పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు పెట్టారు. సంగారెడ్డి జిల్లాలో 136, మెదక్ జిల్లాలో 80, సిద్ధిపేట జిల్లాలో 75 ప్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంతో ఉదయం నుండే పెట్రోల్ బంకుల ముందు భారీ క్యూ లైన్లు కట్టారు. దీనికి తోడు కొన్ని ఫ్యూయల్ స్టేషన్లలలో నో స్టాక్ బోర్డులు కనిపించడంతో .. జనాల్లో అందోళన మరింత పెరిగింది. ఈ ప్రభావంతో అవసరం ఉన్నా.. లేకున్నా పెట్రోల్, డీజిల్ కోసం గంటలతరబడి క్యూ లైన్లు కట్టి తమ వాహనాల ట్యాంకులను పుల్లుగా నింపుకునే ప్రయత్నం చేశారు.
క్రెడిట్ విధానం తీసివేయడమే కారణమా..
పెట్రోలు, డీజిల్ కొరత (Fuel Shortage) లేదని ఇటు ప్రభుత్వం, అటూ చమురు కంపెనీలు చెబుతున్నప్పటికీ జనాలు మాత్రం ముందు జాగ్రత్తగా తమ వాహనాలతో పెట్రోలు బంకుల దగ్గరకు వస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పెట్రోలు బంకులు మూసివేసి, నో స్టాక్ బోర్డులు కనిపించాయి. దీనికి ప్రధాన కారణంగా యుద్ధం నేపథ్యంలో చమురు సంస్ధలు క్రెడిట్ సిస్టమ్ ను తీసివేయడమేనని తెలుస్తుంది. గతంలో క్రెడిట్ విధానంలో చమురు సంస్ధలు పెట్రోలు, డీజిల్ సరఫరా చేసేవని, కానీ గత వారం రోజుల నుండి ముందస్తుగా చెల్లింపులు చేస్తేనే ఇంధనం సరఫరా చేస్తున్నారని బంక్ యాజమానులు చెబుతున్నారు. ఈ కొత్త విధానంతో చాలా మంది బంక్ యాజమానులు ముందుస్తు చెల్లింపులు చేయకపోవడంతో.. వారి వద్ద ఉన్న నిల్వలు అయిపోతున్నాయి. దీంతో పాటు వారికి క్రమంగా రావల్సిన ఇంధనం రాని పరిస్ధితి ఏర్పడింది. ఈ కారణంగా నో స్టాక్ బోర్డులను పెట్టి బంకులను మూసివేశారు.
ఇలా చాలా ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ప్రజలు సైతం ప్యానిక్ అయ్యి.. అవసరం కంటే ఎక్కువగా పెట్రోలు, డీజిల్ ను కొనుగోలు చేస్తున్నారు. చమురు సంస్ధల నుండి సరఫరాలో ఇబ్బంది లేదని.. కానీ క్రెడిట్ విధానం వలన కొత్త ఇబ్బంది అవుతుందని చెబుతున్నారు యాజమానులు. ముందస్తు చెల్లింపులు చేసి, ట్యాంకర్ బుక్ చేసుకున్నవారికి పెద్దగా సరఫరా విషయంలో ఇబ్బందిలేదని చెబుతున్నారు. ప్రభుత్వరంగ సంస్ధలు హెచ్ పిసిఎల్ (HPCL), ఐఓసీఎల్ (IOCL), బీపీసీఎల్ (BPCL) సంబంధించిన 60 శాతం పైగా పెట్రోల్ బంకులలో ఇంధనం అందుబాటులో ఉన్నది. ప్రైవేట్ కు సంబంధించిన ఎస్సార్, రిలయన్స్, ఇతర సంస్ధలకు చెందిన బంకులు చాలావరకు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి.
టూ వీలర్స్ కి రూ.300.. ఫోర్ వీలర్స్ కు రూ.2000 మాత్రమే..
మామూలు సమయాల్లో చాలామంది టూవీలర్స్ కోసం 100 నుండి 200 రుపాయల వరకు పెట్రోల్ పోయించుకునేవారని, కానీ ప్రసుత్త పరిస్ధితుల్లో ఎవరు చూసిన ఫుల్ ట్యాంకు లేదా 500 రుపాయల పెట్రోల్ నింపించుకుంటున్నారని చెబుతున్నారు. అదేవిధంగా ఫోర్ వీలర్స్ కోసం 1000 నుండి 2000 వరకు మాత్రమే నింపమని అడిగేవారని, కానీ ప్రసుత్తం పుల్ ట్యాంకు లేదా రూ.4000 పైగా కొట్టమని అడుతున్నరని ఫిల్లింగ్ స్టేషన్ యాజమానులు చెబుతున్నారు. మాములు దానికంటే, అవసరానికి మించి ఎక్కువగా పెట్రోల్, డీజిల్ అడుగుతుండటంతో తమ వద్ద ఉన్న స్టాక్ కుడా త్వరగా అయిపోయిందని చెబుతున్నారు. ఉన్న ఇంధనంను వీలైనంత ఎక్కువగా కస్టమర్స్ కు సర్ధుబాటు చేయలనే ఉద్ధేశ్యంతో టూవీలర్స్ రూ.300 లోపు, ఫోర్ వీలర్స్ కి రూ.2000 లోపు మాత్రమే పెట్రోల్ డీజిల్ ను విక్రయిస్తున్నారు.
తాజా పరిణామల నేపథ్యంలో ఏ సమయంలో చూసిన బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. ఇదే డిమాండ్ కొనసాగి, భారీగా జనాలు వస్తుంటే బంకుల వద్ద పోలిసుల బందోబస్తు మధ్య తమ బంకులను నిర్వహించవల్సిన పరిస్ధితి వస్తుందని చెబుతున్నారు బంక్ యాజమానులు. మరోవైపు డిమాండ్ ను అసరా చేసుకొని పెట్రోల్, డీజిల్ ను అధిక ధరలకు విక్రయించడం, బ్లాక్ మార్కెట్ కు తరలించడం, కల్తీచేసే అవకాశం లేకపోలేదు. సివిల్ సప్లై అధికారులు.. కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పర్యటించి తనీఖీలు చేయవల్సిన అవసరం ఉన్నది. ప్రతిరోజు ప్రజలకు ఖచ్చితమైన ప్రచారం ఇవ్వడంతో పాటు.. సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకొవాలని, ప్రజలకు ఇంధనం కొరత పట్ల అవవాహన కల్పించి, వారికి సంపూర్ణ భరోసా ఇవ్వవల్సిన భాధ్యత అధికారులపై ఉంది.

