కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palwancha) జాతీయ రహదారి పై తారు కుప్ప ప్రమాదకరంగా మారింది. దీంతో రోడ్డు పై వెళ్ళే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాల్వంచ పట్టణంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై అధికారుల బాధ్యతారాహిత్యం వాహనదారుల ప్రాణాల మీదకు తెస్తోంది. రోడ్డు మరమ్మతుల పేరుతో ప్రధాన రహదారిపై వదిలేసిన డాంబర్ కుప్ప ఇప్పుడు ప్రమాదాలకు నిలయంగా మారింది.
పాల్వంచ (Palwancha) జాతీయ రహదారి నుండి గొల్లగూడెం వెళ్లే దారి మధ్యలో తాత్కాలిక మరమ్మతుల కోసం అధికారులు డాంబర్ మిశ్రమంతో లెవెలింగ్ పనులు చేపట్టారు. అయితే, పని పూర్తయిన తర్వాత మిగిలిన తారు కుప్పను రోడ్డు పక్కకు తొలగించకుండా, ప్రధాన రహదారిపైనే వదిలేశారు. ఈ రహదారి గుండా నిత్యం పాఠశాల విద్యార్థులు ద్విచక్ర వాహనాలపై, సైకిళ్లపై వెళ్తుంటారు. మలుపు వద్ద ఈ కుప్ప ఉండటంతో వేగంగా వచ్చే వాహనదారులు అదుపుతప్పి పడిపోయే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఈ పనులు ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో జరిగాయా లేక మున్సిపల్ శాఖ చేపట్టిందా అన్నది స్పష్టత లేనప్పటికీ, పని చేసిన కాంట్రాక్టర్లు, పర్యవేక్షించాల్సిన అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “చిన్నపాటి నిర్లక్ష్యం ఒక కుటుంబానికి కోలుకోలేని నష్టాన్ని మిగులుస్తుంది. కనీస బాధ్యత లేకుండా రోడ్డుపై కుప్పలు వదిలేయడం అధికారుల అశ్రద్ధకు పరాకాష్ట” అని స్థానిక వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, రహదారిపై ఉన్న డాంబర్ కుప్పను తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగకముందే అధికారులు మేల్కొని ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also: మధిరకు మరో ప్రాజెక్టు.. సమీకృత మండలాఫీసు..
Follow Us On: Instagram

