కలం, వెబ్ డెస్క్ : పల్నాడు (Palnadu Boat Accident) జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోనూరు గ్రామ సమీపంలో కృష్ణా నదిలో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడింది. బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కొందరు వ్యక్తులు నదిలో చిన్నపడవలో విహారయాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పడవ బోల్తా పడడంతో మొత్తం పది మంది నీటిలో మునిగిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి ఆరుగురిని రక్షించగా.. మరో నలుగురు గల్లంతయ్యారు.
అయితే అనంతరం చేపట్టిన గాలింపు చర్యల్లో ముగ్గురి మృతదేహాలు లభించాయి. మృతులు గంధం సంధ్య (9), గంధం సైనీ (10), బత్తుల కార్తీక్ (12) అనే చిన్నారులుగా తేల్చారు. కాసేపటి తర్వాత గల్లంతైన చైతన్య (28) మృతదేహాన్ని కూడా కనుగొన్నారు. ఈ ఘటనతో కోనూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా, ఈ ఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా కోనూరులో పడవ ప్రమాదం బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి అని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని, కుటుంబాలకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు.

