కలం, వెబ్ డెస్క్: హోర్ముజ్ జలసంధిలో భారత నావికులు (Indian Sailors) భయభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. అక్కడ చిక్కుకున్న 13 నౌకల్లోని 562 మంది భారతీయ నావికులు గత 107 రోజులుగా తీవ్ర భయాందోళనలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో ఒమన్లోని ఓ నౌకలో అనారోగ్యంతో కన్నుమూసిన నిశాంత్ ఉర్తనాథన్ అనే భారతీయ నావికుడి భౌతిక కాయాన్ని త్వరలోనే స్వదేశానికి తీసుకురానున్నారు. ఈ విషయమై ఒమన్ రాజధాని మస్కట్లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిశాంత్ కుటుంబ సభ్యులతో పాటు నౌక సిబ్బంది, సంబంధిత అధికారులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, ఆయన భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా భారత్కు తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేసింది.
మరోవైపు, ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ (Iran) మధ్య మొదలైన ఘర్షణల కారణంగా ఈ 562 మంది నావికులు ఇక్కడ చిక్కుకుపోయినట్లు నౌకాయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 329 మంది జలసంధికి పశ్చిమ భాగాన, 233 మంది ఒమన్ గల్ఫ్ తూర్పు ప్రాంతంలో దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, ఆదివారం ఒమన్ తీరంలో ‘విరాట్ 1’ అనే మరో భారతీయ సరకు రవాణా నౌక ప్రమాదానికి గురైంది. ఇంజిన్ వైఫల్యం కారణంగా ఈ నౌకలోని 14 మంది భారతీయ సిబ్బంది రక్షణ పడవల సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం వారి కోసం గాలింపు రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని రాయబార కార్యాలయం వెల్లడించింది.

