కలం, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సికింద్రాబాద్ నుండి గుంటూరు వైపు వెళ్తున్న పల్నాడు ఎక్స్ప్రెస్ (Palnadu Express) రైలులో సాంకేతిక లోపం తలెత్తడంతో భువనగిరి మండలం బొమ్మాయిపల్లి సమీపంలో పట్టాలపై నిలిచిపోయింది. సికింద్రాబాద్ నుంచి పల్నాడు వెళ్తున్న ఈ రైలు బొమ్మాయిపల్లి గ్రామ సమీపానికి చేరుకోగానే, రైలు ఇంజిన్లో హఠాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో లోకో పైలట్ రైలును అక్కడే నిలిపివేశారు. గంటన్నర పాటు రైలు (Palnadu Express) కదలకుండా పట్టాలపైనే ఉండిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు.
ప్రధాన మార్గంలో పల్నాడు ఎక్స్ప్రెస్ నిలిచిపోవడంతో ఈ రూట్లో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇతర రైళ్లను వెనుక ఉన్న స్టేషన్లలోనే నిలిపివేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, తాగడానికి నీరు, ఆహారం అందుబాటులో లేని చోట రైలు ఆగడంతో వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న రైల్వే సాంకేతిక నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంజిన్ మరమ్మతులు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రత్యామ్నాయంగా మరో ఇంజిన్ను పంపించి రైలును పంపేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరమ్మతులు పూర్తయి రైలు తిరిగి ఎప్పుడు బయలుదేరుతుందా అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.

