ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. పాక్ స్టార్ ఓపెనర్లు దూరం!

కలం, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా (Australia) తో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్న సమయంలో పాకిస్థాన్ జట్టు (Pakistan Team) కు భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్లు సయీమ్ అయూబ్ (Saim Ayub), ఫఖార్ జమాన్ (Fakhar Zaman) ఇద్దరూ ఈ సిరీస్‌కు దూరమయ్యారు. వీరిద్దరు ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్నారని, అందుకే వారిని ఎంపిక చేయడం లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధికారికంగా ప్రకటించింది. బోర్డు వైద్య బృందం పర్యవేక్షణలో వీరికి పునరావాస ప్రక్రియ జరుగుతోంది. రెండు వారాల్లో ప్రారంభం కానున్న ఈ మూడు వన్డేల సిరీస్ కోసం పీసీబీ ఇంకా తమ జట్టును ప్రకటించలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన గత సిరీస్‌ను 2-1తో పోగొట్టుకున్న పాకిస్తాన్.. ఇప్పుడు ఆస్ట్రేలియాను ఎదుర్కోవడానికి కొత్త ఓపెనర్లను వెతుక్కోవాల్సి వస్తోంది.

ఈ రేసులో టీ20 ఫార్మాట్‌లో మంచి ఫామ్‌లో ఉన్న సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బంగ్లాదేశ్‌పై వన్డే అరంగేట్రం చేసి కేవలం 64 పరుగులే చేసినా, ఆ తర్వాత పీఎస్ఎల్‌లో 42.22 సగటుతో 380 పరుగులు చేసి ఫర్హాన్ ఆకట్టుకున్నాడు. అలాగే, పీఎస్ఎల్‌లో పెషావర్ జల్మీని విజేతగా నిలిపి, 580 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన మాజీ కెప్టెన్ బాబర్ ఆజం కూడా వన్డే జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది.

ఫాస్ట్ బౌలర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌తో పాటు హిట్టర్ ట్రావిస్ హెడ్ ఈ సిరీస్‌లో ఆడటం లేదు. మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో లబుషేన్, అలెక్స్ కేరీ, జోష్ ఇంగ్లిస్, ఆడమ్ జంపా లాంటి ఆటగాళ్లు ఉన్నారు. ఈ రెండు జట్ల మధ్య మొదటి వన్డే మే 30 శనివారం నాడు రావల్పిండిలో జరగనుంది. ఆ తర్వాత మిగిలిన రెండు మ్యాచ్‌లు లాహోర్‌లో జరుగుతాయి. ఓపెనర్ల లోటు పాకిస్తాన్‌ను ఎంతవరకు దెబ్బతీస్తుందో, ఆసీస్ కొత్త వ్యూహాలు ఎలా పనిచేస్తాయో సిరీస్ మొదలైతేనే తెలుస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>