కలం మెదక్ బ్యూరో: వడ్లు అమ్మడానికి తీసుకువచ్చిన రైతులు లారీల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నెలల తరబడి కొనుగోలు లేక కల్లాల వద్ద రైతులు ఎదురుచూడాల్సి వస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని బోనాల కొండాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు ఆలస్యంపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి.. రైతులు ఇబ్బందులు పడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. లారీల పంపిణీలో ఎలాంటి ఆలస్యం చేయొద్దని, వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

