కలం, నల్లగొండ : నల్లగొండ జిల్లా కనగల్ మండలం బచ్చన్నగూడెం పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు కొప్పుల సైదులు (Incharge Saidulu) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి తెలిపారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశాల మేరకు గురువారం అదనపు కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి సైదులు (Incharge Saidulu) చికిత్స పొందుతున్న నల్లగొండ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి వైద్యులను సంప్రదించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, జి.యడవల్లి పిఎసిఎస్ ఆధ్వర్యంలో బచ్చన్నగూడెంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని.. అయితే, రైస్ మిల్లర్లు ధాన్యం దిగుమతిలో ఇబ్బందులు కలిగిస్తూ, కొనుగోలు చేసిన ధాన్యాన్ని దింపుకోవడం లేదని ఆరోపిస్తూ కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు సైదులు తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారని వివరించారు.
సమాచారం అందుకున్న వెంటనే సైదులను 108 అంబులెన్స్ ద్వారా నల్లగొండ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. సైదులు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వైద్యులను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా సహకార శాఖ అధికారులు, పౌరసరఫరాల శాఖ సిబ్బంది ఆసుపత్రి వద్దనే ఉండి సైదులు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని వెల్లడించారు.

