కలం, వెబ్ డెస్క్: సాఫ్ట్ వేర్ దిగ్గజ కంపెనీ ఒరాకిల్ (ORACLE) మరోసారి ఉద్యోగ కోతలకు సిద్ధమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించింది. వీరిలో సుమారు 12 వేల మంది వరకు ఇండియాలోనే పనిచేస్తుండటం గమనార్హం. రోజురోజుకు పెరిగిపోతున్న ఏఐ వినియోగంతో పాటు ఆటోమేషన్ ప్రక్రియలో వస్తున్న కొత్త సాంకేతిక వ్యవస్థలను అందుకోవడమే సంస్థ ప్రధాన లక్ష్యమని.. ఉద్యోగాల కోత తప్పడం లేదని సమర్థించుకుంది.
ఉద్యోగులకు 3 నెలల అదనపు జీతం..
సంస్థ నుంచి తొలగిస్తున్నట్లు ఇప్పటికే ఉద్యోగులకు మెయిల్స్ వెళ్లినట్లు చెబుతున్నారు. అందులోనే.. ఇప్పటివరకు పనిచేసిన నెల వేతనంతో పాటు కంపెనీ నిబంధనల ప్రకారం, మూడు నెలల అదనపు వేతనాన్ని కూడా అందించబోతున్నట్లు ప్రకటించింది. కాగా, టెక్ ప్రపంచంలో ఇలాంటి భారీ స్థాయి కోతలు ఒరాకిల్ నుంచే ప్రారంభం కాగా.. త్వరలోనే ఇది అన్ని కంపెనీలను చుట్టుముట్టనుందనే సంకేతాలు కలవరపెడుతున్నాయి. సాఫ్ట్ వేర్ రంగం నుంచి ఇతర రంగాల వైపు మళ్లుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటుండటం గమనార్హం.

