కలం, వెబ్ డెస్క్: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) తీరుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఆయన సభా నియమాలను ఉల్లంఘిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీంతో స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం (No Confidence Motion) పెట్టేందుకు ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. సోమవారం ఉదయం ప్రారంభమైన లోక్సభ ప్రతిపక్షాల ఆందోళనతో మధ్యాహ్నానికి వాయిదా పడింది. స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదంటున్నారు. సభ వాయిదా పడిన తర్వాత కూడా పార్లమెంట్ ఎదుట ప్రతిపక్ష నేతలు ఆదోళనకు దిగారు. కాంగ్రెస్, టీఎంసీ సహా ఇతర ప్రతిపక్షాలు కలిసి 100 మంది లోక్సభ సభ్యుల సంతకాల మద్దతుతో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.


