కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమెరికా నుంచి స్వదేశానికి వచ్చిన ఓ కుటుంబం భద్రాచలం (Bhadrachalam) యాత్రకు బయలుదేరింది. సరదాగా సాగాల్సిన ఆ కుటుంబ భద్రాచలం పుణ్యక్షేత్ర యాత్ర ఒక్కసారిగా శోకయాత్రగా మారింది. భద్రాచలం దర్శనానికి వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road Accident) ఓ చిన్నారి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఘటన వివరాల్లోకి వెళితే… అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అనురాగ్ కుటుంబం ఇటీవల విశాఖపట్నం నుంచి ఖమ్మం జిల్లా మధిరలోని తమ బంధువుల ఇంటికి వచ్చింది. బుధవారం చిన్నారి ఆయిద్యను తీసుకుని తల్లి హాద్య, అమ్మమ్మ పద్మావతి, తాతయ్య కృష్ణకేశవ్లతో కలిసి భద్రాద్రి శ్రీరాముడి దర్శనానికి కారులో బయలుదేరారు. వాహనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సాయిబాబా ఆలయం సమీపానికి చేరుకోగానే అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆయిద్య అక్కడికక్కడే మృతి చెందింది. కళ్ల ముందే చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. అమెరికా నుంచి వచ్చిన కొద్ది రోజులకే చిన్నారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. ఈ విషాద ఘటనతో మధిర, పాల్వంచ పరిసర ప్రాంతాలలో దుఃఖ వాతావరణం నెలకొంది.

