కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palvancha) మండలంలో ప్రస్తుతం కేవలం మూడు ఆధార్ కేంద్రాలే ఉన్నాయి. అందులో ఒక సెంటర్లో సేవలు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాల్వంచ బసవతారక కాలనీ పరిధిలో ఉన్న ఆధార్ కేంద్రం రెండు నెలలుగా మూతపడటంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గంటల తరబడి ఎదురుచూపులు
పాల్వంచ (Palvancha) మండలపరిధిలో నివసించే ప్రజలు ఆధార్ కార్డుకు సంబంధించిన పేరు మార్పు, చిరునామా సవరణ, బయోమెట్రిక్ అప్డేట్, మొబైల్ నంబర్ నమోదు వంటి మొదలగు అవసరాల కోసం తప్పనిసరిగా టౌన్లోని కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సమయం, డబ్బు రెండూ వృథా అవుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికే పాల్వంచ టౌన్లోని ఆధార్ కేంద్రాల వద్ద భారీగా రద్దీ నెలకొంది. తెల్లవారుజామునే ప్రజలు క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తుండగా, పలువురికి గంటల తరబడి వేచి చూసినా సేవలు అందక నిరాశగా వెనుదిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన ఆధార్ సేవల అవసరం
ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల అడ్మిషన్ల సీజన్ కొనసాగుతుండటంతో ఆధార్ సేవల అవసరం మరింత పెరిగింది. విద్యార్థుల అడ్మిషన్లు, స్కాలర్షిప్లు, ఇతర ధృవీకరణల కోసం ఆధార్ తప్పనిసరి కావడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రెండు నెలలుగా మూతపడ్డ పాల్వంచ బసవతారక కాలనీ ఆధార్ కేంద్రం ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందో స్పష్టత లేక ప్రజల్లో ఆందోళన నెలకొంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రూరల్ ఆధార్ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించి, గ్రామీణ ప్రజలకు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

