కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ (Kohli vs Travis Head) మధ్య జరిగిన వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. అయితే ఈసారి విమర్శలు ఆటగాళ్లకే కాకుండా వారి కుటుంబాలు, స్నేహితుల వరకు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యవహారంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తీవ్రంగా స్పందించారు. గత వారం హైదరాబాద్లో జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య మైదానంలో వాగ్వాదం జరిగింది.
ఆ సమయంలో ఇద్దరూ ఒకరితో ఒకరు మాటలు మార్చుకుంటూ కనిపించారు. అసలు ఏమి మాట్లాడుకున్నారన్నది బయటకు రాలేదు. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఉద్రిక్తత కొనసాగినట్లు కనిపించింది. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు చేతులు కలుపుతున్న సమయంలో ట్రావిస్ హెడ్ కోహ్లీ దగ్గరకు వెళ్లినా, కోహ్లీ ఇతర ఆటగాళ్లతో చేతులు కలుపుతూ ముందుకు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
ఈ వివాదం తర్వాత ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా హెడ్ స్పందించారు. సోషల్ మీడియాలో తమ కుటుంబ స్నేహితులు, బంధువులపై దూషణలు పెరిగాయని ఆమె చెప్పారు. వరల్డ్ కప్ సమయంలో జరిగిన ట్రోలింగ్ మళ్లీ జరుగుతున్నట్లుగా అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. తాము బాగానే ఉన్నప్పటికీ తమకు దగ్గరైన వారిని టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై ఆకాశ్ చోప్రా కూడా ఘాటుగా స్పందించారు. ఆటగాళ్ల భార్యలు, పిల్లలను దూషించడం చాలా దిగజారుడు చర్య అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇతరులను విమర్శించే వారు తమపై విమర్శలు వస్తే మాత్రం భరించలేరని ఆయన అన్నారు. జెస్సికా హెడ్ మరోసారి క్రీడల్లో మానసిక ఆరోగ్యం గురించి చర్చ అవసరమని చెప్పారు. ఆటపై అభిమానం సహజమే అయినా, ఆటగాళ్ల వెనుక కుటుంబాలు కూడా ఉంటాయని గుర్తు పెట్టుకోవాలని ఆమె సూచించారు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, 2024 బాక్సింగ్ డే టెస్ట్ తర్వాత కూడా ఇలాంటి ట్రోలింగ్ ఎదురైందని ఆమె గుర్తుచేశారు.
ఇదిలా ఉండగా ఈ వివాదం మరో విచిత్ర మలుపు కూడా తీసుకుంది. ట్రావిస్ హెడ్ పేరులో “ట్రావిస్” ఉండటంతో కొందరు అభిమానులు పొరపాటున అమెరికన్ ర్యాపర్ ట్రావిస్ స్కాట్ సోషల్ మీడియా ఖాతాపై విమర్శలు చేశారు. క్రికెట్తో సంబంధం లేకపోయినా ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అసభ్య కామెంట్లు వెల్లువెత్తాయి.

